నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.ఆయన రేడియాలజిస్టే కాదు, దూరదృష్టి గల వ్యక్తి. నిమ్స్ను దేశంలో ప్రీమియర్ వైద్య సంస్థగా మార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్గా సేవలందించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిమ్స్ను తీర్చిదిద్దారు కాకర్ల. 2000 సంవత్సరంలో ఆయన పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు.