హైదరాబాద్, మే,25; కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. కోవిడ్తో ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఉద్యోగి మృతి చెందినతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు పెద్ద మనసు చాటుకుంటుంది. ఫస్ట్వేవ్లో 1500 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సెకండ్వేవ్ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని టాటా స్టీల్ ప్రకటించింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది.
ఈ మేరకు టాటా స్టీల్ తమ ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం కొనసాగించేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రకటించింది. ఒక వేళ మా ఉద్యోగి కరోనాతో మరణిస్తే, సదరు ఉద్యోగి కుటుంబానికి వేతనం అందిజేస్తామని టాటా తెలిపింది. ఉద్యోగి మరణించే నాటికి ఎంత వేతనం పొందుతున్నారో.. అంతే మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏండ్లు నిండే వరకు వారి ఫ్యామిలీకి అందిస్తామని తెలిపింది. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా కూడా చూస్తామని తెలిపింది.
ఒక వేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడి, సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం.. అని సోషల్ మీడియా టాటా వేదికగా వెల్లడించింది. తమ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణగా నిలుస్తామని తెలిపింది. ఈ కీలక నిర్ణయం తీసుకున్న టాటా స్టీల్ కంపెనీ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు.