చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల చిరంజీవి జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో ఆయన పక్కామాస్ లుక్లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. పూర్తిస్థాయి మాస్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు శ్రీను’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. కథానుగుణంగా అనేక టైటిల్స్ను పరిశీలించిన చిత్ర బృందం చివరకు ఆ టైటిల్ను ఓకే చేసిందని అంటున్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక సమాచారం వెలువడనుందని చెబుతున్నారు. చిరంజీవి ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, మోహన్రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది.