అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేయబోతున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటనను రామ్చరణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘సమయానికి రక్తం దొరక్క ఎవరు మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవిగారు బ్లడ్బ్యాంక్ ప్రారంభించారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరు మరణించకూడదనే లక్ష్యంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించాం. వచ్చే వారం రోజుల్లోనే ప్రజలకు ఈ ఆక్సిజన్ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్చరణ్ తీసుకోనున్నారు.
డ్రైవర్ కుటుంబానికి చిరంజీవి సాయం
కరోనాతో మృతి చెందిన కారవ్యాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబానికి చిరంజీవి గురువారం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. జయరామ్ భార్య శోభ చిరంజీవి బ్లడ్బ్యాంక్లో చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు చేతులమీదుగా చెక్ను అందుకుంది.