తిమ్మాపూర్ రూరల్, జూన్ 1: ఆడబిడ్డ పెండ్లి చేసిన ఇంటికి కరోనా వేళ కష్టం రావద్దనే ఉద్దేశంతో కష్టకాలంలో సైతం కల్యాణలక్ష్మిని అందజేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండలంలోని పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, పర్లపల్లి, నల్లగొండ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గ్రామ, గ్రామానికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డలను ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఆడబిడ్డల సంక్షే మం కోసం మాటలు చెప్పేవారే కానీ, అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎవరూ పాటుపడలేదన్నారు. దేశవ్యాప్తంగా ఆడబిడ్డల కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు.
వలస కార్మికులకు అండగా…
కాగా, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసేందుకు గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు వలస కార్మికులు కనిపించడంతో వారికి అండగా నిలిచారు. నల్లగొండలో జరిగిన శ్రీ సీతారామ లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా రంగుల రాట్నం తదితర పనులు నిర్వహించిన వారు లాక్డౌన్తో ఇక్కడే ఉండిపోవడంతో వారికి కూరగాయలు, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ పడిగెల రాజ్కుమార్, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.