సమస్యలపై మెస్సేజ్ చేయండి.. పరిష్కరిస్తా
కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వార్డు నిద్ర చేయాలి
వసతులపై గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోవాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, జూలై 1: ప్రజలు సమస్యలను మెస్సేజ్లో తెలియజేస్తే నిమిషంలో స్పందిస్తానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందు ఆరు మొక్కలను నాటాలని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ అధికారులు వచ్చి ఇస్తారని అన్నారు. గురువారం పట్టణంలోని 5వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, అడిషినల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, వార్డు కౌన్సిలర్ మేఘావత్ శాంతి రమేశ్, కౌన్సిలర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పట్టణ ప్రగతిలో భాగంగా 10రోజుల పాటు ఏ రోజు ఏ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహిస్తారో చదివి వినిపించారు.
అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే కౌన్సిలర్లు వార్డు ప్రత్యేకాధికారులకు సహకరించి సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి వేదిక అని, ప్రజలందరూ సహకరించాలన్నారు. 5వ వార్డులో పార్కు కావాలని వార్డు ప్రజలు కోరగా స్పందించిన కలెక్టర్ పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయ్యే లోగా స్థలం ఎంపిక, ఎస్టిమేట్ వేసి తమ వద్దకు తీసుకురావాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం మంత్రి నిరంజన్డ్డి మాట్లాడుతూ వానకాలం ప్రారంభమైనప్పుడు సీజనల్ వ్యాధులు అదేస్థాయిలో ప్రబలుతాయని వాటిని నివారించడానికి ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిందన్నారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, మంచినీటి సమస్యలను ప్రజలు నేరుగా మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి నియోజకవర్గపరిధిలో 3వేల డబుల్ ఇండ్లు మంజూరు కాగా పట్టణంలో రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన కొంతమందికి ఇవ్వడం జరిగిందని, మరో నెల వ్యవధిలో దాదాపు 800ఇండ్లు పూర్తి కావస్తున్నాయన్నారు. మిగిలిన 2వేల ఇండ్లు ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. అదేవిధంగా పట్టణంలో రూ.300 కోట్లతో రేవల్లి మండలం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కొత్తకోట సమీపంలోని బుగ్గపల్లితండా వరకు పైపులైన్ వేసి మంచినీటిని తెచ్చి ప్రజలకు అందించడానికి పనులు జరుగుతున్నాయన్నారు. వనపర్తి జిల్లాకు 500 పడకలతో మెడికల్ కళాశాల రావడం స్థానికంగా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రతి నెలలో ఆయా వార్డు కౌన్సిలర్ ప్రజలతో ప్రతి వారం ఒక రోజు సమావేశాన్ని నిర్వహించుకోవాలని, మున్సిపల్ కమిషనర్ వార్డు నిద్ర చేయాలని, కలెక్టర్ నెలలో ఒకరోజు ఒక వార్డును ఎంపిక చేసుకుని వార్డు నిద్ర చేయాలని కలెక్టర్ను మంత్రి కోరగా తప్పకుండా చేస్తానని కలెక్టర్ చెప్పారు. అనంతరం వార్డులో మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్, అధికారులు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘పల్లెప్రగతి ’తో గ్రామాలు అభివృద్ధి
వనపర్తి రూరల్, జూలై 1: రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధికి ప్రభుత్వం కావాల్సిన వసతులను పల్లె ప్రగతి కార్యక్రమం కల్పించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కడుకుంట్లలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఎండ్లుగా సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను తెలంగాణ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ ప్రణాళికతో అధిగమించామన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ప్రభుత్వం రూ.25వేల కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. నేడు గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చని పైర్లతో పంటలు కనిపిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పంచాయతీకి పల్లెప్రగతి కార్యక్రమంలో ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ అందించామన్నారు. దీంతో గ్రామాల్లోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి ఎరువుగా తయారు చేయిస్తున్నామన్నారు. ఏటా వేల మొక్కలను నాటించడం జరుగుతుందని, అందుకు గ్రామాల్లోనే మొక్కలు పెంచి నాటించి సంరక్షిస్తున్నామన్నానరు. అలాగే క్రిమిటోరియం, ప్రకృతివనాల వసతులను కల్పించిందన్నారు. యువత కోరిక మేరకు ఆటస్థలం, కడుకుంట్ల గ్రామానికి మంజూరైన బీసీ గురుకుల పాఠశాల భవనానికి స్థల పరిశీలన త్వరలోనే చేయిస్తామన్నారు. అదేవిధంగా మంత్రి నిరంజన్రెడ్డి గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ప్రతి ఇంటి వద్ద, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని విజయవంతం చేయాల న్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు కృష్ణయ్య, చీర్లసత్యం, చంద్రకళ, నక్కరాములు, నాయకులు ప్రేమ్, కృష్ణయ్య, రహీం, పరంజ్యోతి, శరవంద, జెడ్పీ సీఈవో, డీపీవో సురేశ్కుమార్, డీఆర్డీవో నర్సింహులు, విద్యుత్ ఎస్ఈ నాగేంద్రకుమార్, సర్పంచ్ హరిత, వైస్ ఎంపీపీ సువర్ణ, టీఆర్ఎస్ నాయకులు, బాలకృష్ణ, శ్రీనివాసులు, శివన్న తదితరులు పాల్గొన్నారు.