రంగారెడ్డి, ఏప్రిల్ 26,(నమస్తే తెలంగాణ): గొప్ప మనస్సున్న సీఎం కేసీఆర్ డబ్బుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించి రాష్ట్రంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ వేయించడానికి రూ.2500 కోట్లు ఖర్చు అవుతున్నా సిద్ధమయ్యారని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి ఛాంబర్లో కొవిడ్-19 సెకండ్ వేవ్పై రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ…జిల్లాలో ఇప్పటికే లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిందని, మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియకు సర్వసన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కొవిడ్-19 పై అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 3.36లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 17.648 మంది కరోనా బారిన పడగా చాలా వరకు హోం ఐసోలేషన్లో ఉన్నారని, కొద్దిమంది మాత్రమే దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. రోజుకు 2200 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మహేశ్వరంలో 25బెడ్లతో, రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలో 25, వనస్థలిపురంలో 25తో పాటు మరో 25 బెడ్లు, షాద్నగర్లో 50, పహాడీషరీఫ్ ఏరియా దవాఖానలో 25,చేవెళ్లలో 25బెడ్ల సామర్థ్యం తో వారంలోపు కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ఫ్రైవేట్ దవాఖానల్లో 48గంటల పాటు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ కోసం వ్యాక్సిన్ సెంటర్లు పెంచడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండడం వల్ల ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు సూచించారు. వ్యాక్సి న్, కరోనా టెస్టింగ్ సెంటర్లు దూరం గా ఉండేటట్లు చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వైద్య,రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున చేపట్టబోయే వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలన్నారు.
జిల్లాలోని కొండాపూర్ ఏరియా దవాఖాన, వనస్థలిపురం దవాఖాన తదితర చోట్ల కొవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయని, వాటికి తోడుగా జిల్లాలో 133 ప్రైవేట్ దవాఖానల్లో 7567 బెడ్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో 2వేల వరకు ఆక్సిజన్, వెంటిలేషన్ బెడ్లు ఉన్నాయని, వాటి ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అధికారులు తెలియజేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణలో 30లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ వేసినట్లు, కరోనా చైన్ను విడగొట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలిపారు. ప్రస్తుతం 45 ఏండ్లు పై బడిన వారితో పాటు మే 1 నుంచి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించారని, జిల్లాలో ఈ ప్రక్రియను వారంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్-19 ప్రారంభం అయినప్పటి నుంచి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, ముఖ్యం గా ఆశవర్కర్లు చాలా బాగా సేవలు అందిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంట్లరను కూడా ఏర్పాటు చేసి ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజ లు కూడా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
ఇవీ కూడా చదవండి…
కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఇండియాకు అమెజాన్ సాయం.. సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెనట్రేటర్లు
ఐపీఎల్ను ఆపే ప్రసక్తే లేదు.. వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోవచ్చు: బీసీసీఐ