జీఎస్టీ కౌన్సిల్ భేటీకి రాష్ర్టాల డిమాండ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కీలకమైన ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రేట్లను తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకొంటున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం వెంటనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అలాగే జీఎస్టీ శ్లాబు హేతుబద్ధీకరణ, జీఎస్టీ లోటు పరిహార చెల్లింపు గడువు పెంపు లాంటి అంశాలపై కూడా అత్యవసరంగా చర్చించాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్-19 చికిత్సలో ఎంతో కీలకంగా పరిగణిస్తున్న రెమ్డెసివిర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సహా మరికొన్ని ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్టీలో మినహాయింపులు ఇవ్వాలని రాష్ర్టాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై 12% జీఎస్టీ అమల్లో ఉన్నది. మరోవైపు రెమ్డెసివిర్ ఔషధంతోపాటు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్కు దేశవ్యాప్తంగా కొరత కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు ఈ యాంటీ వైరల్ డ్రగ్తోపాటు ఆక్సిజన్ కోసం కేంద్రానికి భారీగా ఆర్డర్లు పెట్టాయి. మరోవైపు జీఎస్టీ అమలు వల్ల ఆదాయాలు కోల్పోయిన రాష్ర్టాలకు ఇచ్చే పరిహార గడువును మరింత పొడిగించాలని కొన్ని రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి.