కరోనా సంక్షోభంలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనపోరాటం సాగించాల్సిందేనని చెప్పింది సీనియర్ కథానాయిక శృతిహాసన్. మహమ్మారి అంతమయ్యేదాక వేచి చూస్తే ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతాయని పేర్కొంది. గత పదేళ్ల నుంచి తాను స్వతంత్య్రంగా జీవితాన్ని సాగిస్తున్నానని..ప్రతి నెలా చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో ఉంటాయని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘కరోనా సెకండ్వేవ్ వల్ల అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పుటికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిలో సాగిపోవాలి. మాస్క్ లేకుండా సెట్లో ఉండటం భయంకరమైన అనుభవమే కానీ ముందస్తు ఒప్పందం ప్రకారం పనిచేయాల్సిందే. ఇప్పటికే చాలా సినిమాల్ని ఒప్పుకున్నా. అన్నింటిని రద్దు చేసుకుంటే ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కష్టమైపోతుంది. నెలసరి చెల్లింపులు ఆగిపోతాయి. అందుకే రిస్క్ ఉన్నప్పటికీ పనిచేయాల్సిందే’ అని చెప్పింది. జీవితంలో ప్రతి నిర్ణయాన్ని సొంతంగానే తీసుకుంటానని, ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కొవడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని శృతిహాసన్ తెలిపింది. లాక్డౌన్కు ముందే ముంబయిలో సొంతంగా ఇంటిని కొనుగోలు చేయడం గొప్ప ఆనందాన్నిచ్చిందని ఆమె చెప్పింది. ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.