‘నా సినిమాలతో ప్రేక్షకులను నవ్వించడానికే ఇష్టపడతాను. సున్నితమైన కథాంశాన్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మంచి సినిమా తీశామనే నమ్మకముంది’ అన్నారు బన్నీవాస్. వాసువర్మతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్లో బన్నీవాస్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
వివాహ వ్యవస్థ నేపథ్యంలో సాగే కుటుంబకథా చిత్రమిది. పెళ్లికి అర్హత ఏమిటి?పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఏ విధంగా కలిసిమెలసి ఉండాలో పెద్దలు వివరంగా చెప్పాలనే పాయింట్తో దర్శకుడు భాస్కర్ ఈ కథను సిద్ధంచేశారు. జీవితాన్ని కొత్త కోణంలో దర్శించాలని తాపత్రయపడే విభా అనే అమ్మాయిగా పూజాహెగ్డే కనిపిస్తుంది. సంప్రదాయాల మధ్య పెరిగిన మధ్యతరగతి యువకుడిగా అఖిల్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీతో జీఏ-2 బ్యానర్లో చేసిన సినిమాలు విజయాన్ని సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కలిసివస్తుందనే నమ్మకముంది. ఓటీటీ ట్రెండ్ పెరగడం, కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్కు రాకపోతుండటం వల్ల సినిమాలకు సరైన రెవెన్యూరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాను విడుదల చేయడమన్నది ఫైనాన్షియల్గా చాలా రిస్క్. కానీ అఖిల్ కెరీర్కు గ్యాప్ రాకూడదని దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకొస్తున్నాం.
పన్నులు చెల్లించడం లేదు
థియేటర్స్ పరంగా ఏపీలో నెలకొన్న టికెట్ రేట్స్, సెకండ్ షో, 100 శాతం ఆక్యుపెన్సీ లాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఏపీ ఎగ్జిబిటర్లు సరిగా పన్నులు కట్టడం లేదు. రెండు, మూడు వందల థియేటర్స్ జీఎస్టీ పరిధిలో లేవు. అందువల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. థియేటర్స్ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నది. ప్రారంభదశలోనే ఉన్న ఈ విధానంపై చాలామందిలో అపోహలు నెలకొన్నాయి. బుకింగ్ కౌంటర్స్ ఎత్తివేసి థియేటర్స్ ద్వారా వచ్చే రెవెన్యూను ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తున్నదని అనుకుంటున్నారు. అందులో నిజం లేదు.. తెలంగాణలో థియేటర్స్ అన్ని సిస్టమాటిక్గా నడుస్తుంటాయి. పన్నులను సరిగా చెల్లిస్తుంటారు. ఏపీలో మాత్రం థియేటర్స్రెవెన్యూకు వారు ప్రభుత్వానికి కట్టే పన్నులకు చాలా తేడాలున్నాయి. థియేటర్స్ థర్డ్ పార్టీల చేతుల్లో ఉండటం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండస్ట్రీవైపు ఉన్న ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ లోగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో..
కరోనా కారణంగా ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడిపోయారు. రెండు, మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తుండటంతో థియేటర్కు వెళ్లాల్సిన పనిలేదనే అభిప్రాయం వారిలో బలపడింది. డబ్బులకు ఆశపడి కొందరు నిర్మాతలు తమ సినిమాల్ని తొందరగాఓటీటీలకు ఇస్తున్నారు. వారి వల్ల రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు నష్టపోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రం నటుడిగా, ఇమేజ్ పరంగా అల్లు అర్జున్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆయన కెరీర్లో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుంది. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్లో సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాం. ‘పుష్ప’ మొదటిభాగం పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై క్లారిటీ వస్తుంది.