గత వారం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఏంటంటే.. బుల్లెట్ బండి పాటకు నవ వధువు వేసిన డ్యాన్స్ వీడియో. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీ ను రామకృష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్తో ఈనెల 14వ తేదీన వివాహం జరిపించారు. బరాత్ సమయంలో తన భర్తకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావించిన సాయి శ్రీయ బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసి అతడిని ఫుల్ ఖుష్ చేసింది.
సాయి శ్రీ చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరికి నచ్చడంతో ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. దీంతో బుల్లెట్ బండి పాటకు కూడా పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలో ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప .. సాయి శ్రీయ తో ఫోన్లో మాట్లాడారు. మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే ప్రధాన పాత్రలో నటించాలి ’ అని నిరూప.. సాయి శ్రీయతో చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట.
బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆవిర్భవించి ఇప్పటికే రెండేళ్లు కాగా, ఈ సంస్థ గతంలో రాహుల్ సిప్లిగంజ్, నోయల్ వంటి ప్రముఖ సింగర్స్తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది. రచయిత లక్ష్మణ్ ఈ పాటకి సాహిత్యం అందించగా, ఎస్కే బాజి సంగీతం అందించారు. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు.