వాషింగ్టన్: ఇంకా నూకలు ఉండటంతో తిమింగలం మింగిన ఒక వ్యక్తి మిరాకిల్గా ఎస్కేప్ అయ్యాడు. కొన్ని సెంకడ్లలో అది ఉమ్మి వేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా మసాచుసెట్స్లోని కేప్ కాడ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఎండ్రకాయల కోసం సముద్రంలో డైవ్ చేసే 56 ఏండ్ల మైఖేల్ పాకర్డ్ను హంప్బ్యాక్ తిమింగలం మింగివేసింది. అయితే 40 సెకండ్ల తర్వాత అది సముద్రంపైకి వచ్చి ఉమ్మివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతడి క్రూ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో మైఖేల్ షేర్ చేశారు. సముద్రం నీటిలో సుమారు 14 మీటర్ల లోతులో ఉన్న తనను తిమింగలం మింగిందని చెప్పారు. ఆక్సిజన్ కలిగి ఉన్న తనకు అంతా చీకటిగా మారిందన్నారు. ఇక తన జీవితం ముగిసిందని భావించానని, చివరగా తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే 40 సెకండ్ల తర్వాత ఆ తిమింగలం నీటిపైకి వచ్చి ఉమ్మివేయడంతో దాని బారి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు వివరించారు.