జగిత్యాల, మే 28: ‘హరికిరణ్ ఎలా ఉన్నావు?.. ధైర్యంగా ఉం డు’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. జాగృతి నాయకుడిని ఫోన్లో పరామర్శించారు. కరోనా బారినపడి తీవ్ర అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడ్డ తెలంగాణ జాగృతి జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బైరం హరికిరణ్ను శుక్రవారం ఆమె ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హరికిరణ్ తండ్రి కరోనాతో మరణించడంతో కవిత ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ధైర్యంగా ఉంటూనే, సరైన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలోనూ హరికిరణ్ కుటుంబసభ్యులకు ఆమె మనోధైర్యాన్ని ఇచ్చారు. అప్పట్లోనే ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్వయంగా డాక్టర్తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్కుమార్కు హరికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.