వరంగల్ : జూలై 1 నుండి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన నాల్గొవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతంపై మంత్రి స్పందిస్తూ.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని 1,688 గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలకు మంచి స్పందన లభించిందన్నారు. పల్లె ప్రగతి నాల్గొవ విడత కార్యక్రమంలో గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలను నాటినట్లు చెప్పారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలను శుభ్రం చేయడం జరిగిందని, గుంతలను మట్టితో పూడ్చడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని వైకుంఠధామాలకు, డంపింగ్ యార్డ్ లకు బయో ఫెన్సింగ్ చేసినట్లు, పాత విద్యుత్ స్తంభాలను మార్చడం, విద్యుత్ తీగలు తగలకుండా చర్యలు తీసుకోవడమైందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం మూడు విడతలలో భాగంగా 1,683 గ్రామ డంపింగ్ యార్డులు, 1,669 వైకుంఠధామాలు, 2,898 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. దీని వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామస్థుల కలలు నిజమయ్యాయని మంత్రి తెలిపారు. 1,688 గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చినట్లు చెప్పారు. దీని వల్ల గ్రామాలలో పరిశుభ్ర వాతావరణం ఏర్పడి సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు తగ్గాయన్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డులలో వేసిన చెత్తను రైతులు పొలాలలో సేంద్రియ ఎరువులుగా వినియోగిస్తున్నారని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం, హరితహారం కార్యక్రమం క్రింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,688 గ్రామాలలో గత ఆర్ధిక సంవత్సరంలో 87 లక్షల 59 వేల 653 మొక్కలు నాటగా అందులో 83 లక్షల 63 వేల 42 మొక్కలు (96.18%) బ్రతికినట్లు తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త మొక్కలను నాటుతున్నట్లు వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాలకు రూ. 466 కోట్ల 29 లక్షలు గ్రాంటుగా విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. నూతన పంచాయితీరాజ్ చట్టం వల్ల గ్రామ సర్పంచ్, పంచాయితీ సెక్రటరీలలో, అధికారాలతో పాటు బాధ్యతలు, జవాబుదారీతనం పెరిగిందన్నారు. అందువల్ల గత ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 3 వేల 635 కోట్లు ఇంటి పన్నుగా వసూలు జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీలకు నిధుల కొరత లేదన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాల్గొవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి దిశా నిర్దేశం చేసిన పల్లె ప్రగతి రూపకర్త, ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో విజయవంతం కావడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నడమే కాకుండా అహర్నిశలు కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్కు, జిల్లా ప్రజా పరిషత్తు చైర్మెన్లకు, పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జిల్లా కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన అన్ని ప్రభుత్వ జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులకు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు, ఉద్యోగులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు సర్పంచ్ లకు, పంచాయితీ కార్యదర్శులకు మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుకు ఇదే స్పూర్తితో రాజకీయాలకు అతీతంగా అందరం సమిష్టి కృషి చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.