బీ విటమిన్..సీ విటమిన్..డీ విటమిన్..బీ 12 విటమిన్..ఇలా కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల విటమిన్లను సమకూర్చుకోవాలంటే ఆయా పండ్లు తినాల్సిందే. ఈ విషయాలను వైద్యులే మనకు సూచిస్తున్నారు. జనం కూడా పాటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పండ్ల ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలతో పాటు ఆ పండ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు తినాలంటే మాత్రం కొంత ఆర్థిక భారం తప్పడం లేదు. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు వందలు పెడితే కానీ రెండు మూడు రకాల పండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఒక్కో కుటుంబం పండ్ల కోసమే వారానికి కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదు.
రాష్ట్రంలో పండ్లకు భారీ డిమాండ్ పెరిగింది. అదే స్థాయిలో దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్కు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి పండ్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా నారింజ, బత్తాయి, మామిడి, కివీ, ఆపిల్ పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అన్ని పండ్లు కలిపి గత వారం రోజుల్లో గడ్డిఅన్నారం మార్కెట్కు దాదాపు 1.50 లక్షల టన్నులు రావడం గమనార్హం. నారింజ, యాపిల్, కివీ ఫ్రూట్స్ వంటివాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కివీ పండ్లను న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ నుంచి, ఆరెంజ్ పండ్లను అమెరికా, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి మన రాష్ర్టానికి వచ్చిన పండ్ల కొనుగోలుకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు కూడా పోటీ పడుతుండటం విశేషం.
కొబ్బరి బోండాం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రూ.30-35 పలికిన ధర ఇప్పుడు రూ.50 కి పెరిగిపోయింది. కేరళ కొబ్బరి బోండాం కావాలంటే రూ.60 పెట్టాల్సిందే. ఈ నెలాఖరు వరకు కొబ్బరి బోండాం ధరలు రూ.70-80 వరకు పోయినా అశ్చర్యపోనవసరం లేదని ఓ వ్యాపారి వ్యాఖ్యానించడం గమనార్హం.