వికారాబాద్, మే 24, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఎస్పీ నారాయణ లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించారు. 10 దాటిన తర్వాత రోడ్డెక్కిన వాహనదారులను నిలిపి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు..? అనుమతులు ఉన్నాయా..? అని పత్రాలను పరిశీలించారు. లాక్డౌన్ ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న మోటార్ సైకిళ్లు, కార్లను ఆయా ప్రాంతాల్లోని పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. సరుకు రవాణా వాహనాలను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ సమయాల్లోనే ఎగుమతి, దిగమతులు చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలైన ఆక్సిజన్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, క్యారియింగ్ వాహనాలను, వైద్య పరికరాలు, నీళ్ల ట్యాంకర్లకు మాత్రమే లాక్డౌన్ సమయంలో మినహాయింపు ఉందన్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ తదితర ప్రాంతాలతోపాటు రావులపల్లి, కొత్లాపూర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాండూరు మండలంలో..
తాండూరు రూరల్, మే 24 : తాండూరు మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా సాగుతున్నది. ప్రధానంగా కర్ణాటక నుంచి తాండూరులోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు కొత్లాపూర్ చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణాలోకి కర్ణాటక నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రూరల్ సీఐ జలెందర్రెడ్డి, ఎస్సై ఏడుకొండలు లాక్డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చెక్పోస్టు వద్ద 24 గంటలు పోలీసులు నిఘా పెట్టారు.
పదిలోపే నిత్యావసరాల కొనుగోళ్లు
పరిగి, మే 24 : పరిగిలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా కొనసాగుతున్నది. ఆంక్షల సడలింపు సమయంలోనే ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం పరిగి పోలీసులు హైదరాబాద్, వికారాబాద్ రూట్లలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా, ఈ పాస్ లేకుండా వెళ్తున్న వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సై క్రాంతికుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న వాహనాలు మినహా మిగతా వాటిని సీజ్ చేశారు.