మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అదనంగా మరో 250 బెడ్లతో ఐసొలేషన్ వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని రామంతాపూర్లోని హోమియో దవాఖానలో 100, పీర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన భవనంలో 50 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 50 బెడ్లతో సౌకర్యం ఉన్న నాచారం ఈఎస్ఐ దవాఖానలో అదనంగా 250 బెడ్లతో ఐసొలేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ దవాఖానలలో కొవిడ్ రోగులకు వైద్యం అందిం చే క్రమంలో ఆక్సిజన్ కొరత లేకుండా వైద్యశాఖ ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని ఐసొలేషన్ కేంద్రాల పెంపుపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వాక్సినేషన్ కేంద్రాలను పెంచారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాలలో 42 వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నారు. గతంలో 35 వాక్సినేషన్ కేంద్రాలు ఉండగా, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు అదనంగా మరో 7 కేంద్రాలను ఏర్పా టు చేశారు. వీటిలో ప్రతి రోజు 10 వేల పైచిలుకు టీకాలు ఇస్తున్నట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు.