హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది అన్నిగ్రహాలు రాహువు, కేతువు మధ్యలో ఉన్నందున ఇబ్బందికరమైన సంవత్సరంగా ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కరోనా తీవ్రత వచ్చే జూలై 20వ తేదీవరకు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. కుజుడు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవని స్పష్టంచేశారు. కరోనా తీవ్రత ఎప్పటికి తగ్గుతుందనేది జూలై 20 తరువాతే చెప్పే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉగాది రోజున(ఏప్రిల్ 13) చేసిన పంచాంగ విశ్లేషణ సందర్భంగా కూడా తాము చెప్పినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము చేసిన పంచాంగ విశ్లేషణపై అవగాహనలేని కొందరు సోషల్మీడియాలో లేనిపోని ప్రచారం చేస్తుండటాన్ని శ్రీశారదాపీఠం ఖండిస్తున్నట్టు స్వామీజీ తెలిపారు.