డిచ్పల్లి, జూన్ 9: అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న కాళేశ్వరం పథకం దేశ చరిత్రలో గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్యాకేజీ-21లో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి శివారులో నిర్మిస్తున్న మెంట్రాజ్పల్లి పంప్హౌస్ నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతుల భూములు కోల్పోకుండా, భూగర్భం నుంచే పైప్లైన్స్ ద్వారా ప్రతి ఎకరాకూ నీరందిస్తామన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ప్యాకేజీ-21పనులు జరుగుతున్నాయని, దీని ద్వారా రెండులక్షల ఎకరాలకు సాగు నీరంది బీడు భూములన్నీ సాగులోకి వస్తాయని తెలిపారు. ఈ సీజన్లో పైలెట్ ప్రాజెక్టుగా 20 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పంప్హౌస్ నుంచి క్షేత్రస్థాయిలో పంట పొలాలకు సాగునీరు అందించే విధానం గురించి ఆమె అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బడ్జెట్లో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూ.1600 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో మంచిప్ప రిజర్వాయర్, కాళేశ్వరం ప్యాకేజీ-21కి నిధులు కేటాయించడం రూరల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని పేర్కొంటూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ దాసరి ఇందిర తదితరులు పాల్గొన్నారు.