హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) రూపొందించిన సూక్ష్మ పోషకాల ద్వారా పిల్లల్లో రక్తహీనతను శాశ్వతంగా దూరం చేయవచ్చని తేలింది. ఎన్ఐఎన్ రూపొందించిన సూక్ష్మపోషక పొడిని వినియోగించటం వల్ల 3-6 ఏండ్లలోపు పిల్లల్లో రక్తహీనత గణనీయంగా తగ్గింది. చిన్నారుల్లో బుద్ధిమాంద్యం దూరమై చురుకుదనం పెరుగుతుందని తేల్చింది. రోజుకు ఒక్కో చిన్నారికి కేవలం 38 పైసల ఖర్చుతో రక్తహీనతను జయించవచ్చని ఎన్ఐఎన్ ప్రకటించింది. ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ మాధవన్నాయర్ (ప్రస్తుతం రిటైరయ్యారు) నేతృత్వంలో డాక్టర్ సిల్వియా ఎఫ్ రావు బృందం, అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీతో కలిసి ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2013లో ఎనిమిది నెలలపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లోని 22 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 306 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ చిన్నారులను రెండు గ్రూపులుగా విడదీసి ఎన్ఐఎన్ రూపొందించిన సూక్ష్మపోషక పదార్థాలను రోజూ అంగన్వాడీ కేంద్రంలో పంపణీ చేసే పోషకాహారంలో కలిపి ఇచ్చారు. ఒక గ్రూప్లో ఐరన్, జింక్, విటమిన్-సీ, విటమిన్ బీ-12, పోలిక్ యాసిడ్, విటమిన్-ఏ, విటమిన్ బీ-2 మిశ్రమంగా ఉన్న పొడిని, మరోగ్రూప్ పిల్లలకు ఈ మిశ్రమాలేవి లేని పొడిని ఇచ్చారు. సూక్ష్మపోషక మిశ్రమాన్ని కలిపిన ఆహారం తిన్న చిన్నారుల్లో మూడునాలుగు రోజులు విరేచనాలు, ఎక్కువసేపు నిద్రపోవటం వంటి లక్షణాలు కనిపించినా ఆ తర్వాత చురుకుగా తయారయ్యారు. ఎనిమిది నెలల తర్వాత చిన్నారుల ఎత్తు, బరువు పెరగటమేకాకుండా రక్తహీన చాలావరకు తగ్గింది.
ఒక్కో చిన్నారిపై రోజుకు 38 పైసలు..
ఎన్ఐఎన్ రూపొందించిన ఈ ప్రత్యేక సూక్ష్మపోషక పొడికి ఒక్కో చిన్నారికి రోజుకు కేవలం 38 పైసలు ఖర్చుచేశారు. 8 నెలలపాటు 22 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని 306 మందికి అయిన ఖర్చును మిథాయిల్ ఇనిస్టిట్యూట్ భరించింది. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లోని 2.5 కోట్ల మంది పిల్లలకు సూక్ష్మపోషక పొడిని అందిస్తే భవిష్యత్లో రక్తహీనత సమస్యను ఒక తరం నుంచి దూరం చేయవచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. ఈ పొడి ద్వారా పిల్లల మానసిక, శారీరక ఎదుగులతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని అధ్యయనంలో తేలిందని ప్రకటించింది.
46 నుంచి 10.1శాతానికి తగ్గిన రక్తహీనత
చిన్నారుల్లో సూక్ష్మపోషకాలు వాడకముందు 46శాతం రక్తహీనత ఉండగా, 8 నెలల అనంతరం 10.1శాతానికి తగ్గింది. సూక్ష్మపోషకాలు లేని పొడిని వాడిన పిల్లల్లో 47 నుంచి 35.5 శాతానికి మాత్రమే రక్తహీనత తగ్గిందని సూక్ష్మపోషయాలు వాడిన పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయని పరిశోధనలో పాలుపంచుకొన్న డాక్టర్ సిల్వియా ఎఫ్ రావు తెలిపారు.నేర్చుకోవటంలో (లెర్నింగ్), ఐక్యూ (ఇంటెలిజెంట్ కోషంట్)లోనూ గుణాత్మక మార్పులు వచ్చాయని ఆమె చెప్పారు.