అడుగడుగున ‘తడి’ ఉంది!
ఆయన దృష్టిలో గుడి అంటే మూలవిరాట్టో, ఉత్సవమూర్తులో కాదు. హారతులూ, అర్చనలకే పరిమితం కాదు. ఆ ఆవరణను పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక, పురావస్తు కోణంలో నుంచి చూస్తారు ‘అడుగడుగున గుడి ఉంది’ రచయిత కస్తూరి రాకా సుధాకర్రావు. కాబట్టే, ‘చెక్కిన శిల్పం, మొక్కిన దైవం, ధ్వజస్తంభం పాదాల దగ్గర శతాబ్దాల దీప మాలికలు, కంఠం మూగవోని గంటలు.. ఇవన్నీ ఎన్నో కథలు చెబుతాయి. తరాన్ని తరంలో కలిపి జ్ఞాపకాల మాలలను అల్లుతూ మొక్కులు తీర్చుకున్న భక్తుల భావాలు, స్వరంతో స్వరాన్ని కలిపి శ్రద్ధాళువులు పాడుతున్న రాగాలు, మూర్తిభంజకుల మతోన్మాదాన్ని మట్టికరిపించిన వీరుల త్యాగాలు..’ ఇవన్నీ ఆయన పుస్తకంలో కనిపిస్తాయి, వినిపిస్తాయి.
పాతిక గుడులు.. మనల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని కథలుకథలుగా తమ కతంతా చెబుతున్న భావన కలుగుతుంది. ఓ కథ ఉద్వేగానికి గురిచేస్తుంది. ఓ కథ భక్తిపారవశ్యంలో ముంచెతుత్తుంది. ఓ కథ రోమాంచితులను చేస్తుంది. శైలి గురించి చెప్పనవసరం లేదు. భాష, భావం, వాక్య నిర్మాణం, ఎత్తుగడ, ముక్తాయింపు.. ఐదూ సమపాళ్లలో కుదిరి పంచామృత మాధుర్యాన్ని గుర్తుకుతెస్తాయి. పుస్తకం చదవడం పూర్తయ్యేలోపు అంబాసత్రం రమణదాసుకు శ్రద్ధాంజలి ఘటిస్తాం, ఛాయా సోమేశ్వర ఆలయ రూపకర్తకు జేజేలు పలుకుతాం, మన్నెంకొండ దేవుడికి దండం పెట్టుకుంటాం. ఎంత గొప్ప శివాలయమైనా నందీశ్వరుడితోనే పరిపూర్ణత. ఎంత మంచి పుస్తకానికైనా అలంకరణతోనే అదనపు అందం. చిత్రకారుడు కె. వేణుమాధవ్ పత్ర విన్యాసం వైష్ణవాలయంలోని దద్దోజనంలా, చూడగానే ఆస్వాదించాలనిపించేలా ఉంది.
అడుగడుగున గుడి ఉంది
రచన: కస్తూరి రాకా సుధాకర్రావు
పేజీలు: 146; వెల: రూ.100
ప్రతులకు: ప్లాట్ నం.79, వీఆర్ఆర్ ఎన్క్లేవ్, దమ్మాయిగూడ, హైదరాబాద్.
ఫోన్: 9000875952
మళ్లీ ఆవు-పులి
పదేండ్లు, పాతికేండ్లు, వందేండ్లు.. ఎన్నేండ్లు వెనక్కి వెళ్లినా బాల్యంలో వినే తొలికథల్లో ‘ఆవు-పులి’ కథ ఉండితీరేది. ఇచ్చినమాటకు కట్టుబడి ఉండాలనే నీతిని ఈ కథ తెలియజేస్తుంది. ఆ కథలో ఆవు సత్యనిష్ఠ, పులి దయాగుణం చిన్నారి హృదయాల్లో చెరుగని ముద్రవేసేవి. మన మస్తిష్కంలో నుంచి ఎప్పుడో చెరిగిపోయిన ‘ఆవు-పులి’ కథను మళ్లీ పరిచయం చేశారు రచయిత గరిపెల్లి అశోక్. ఆ పాత కథకు కొనసాగింపుగా వినూత్న సందర్భాలను, కథలను సృష్టించారు. ఈ సంకలనానికి ‘సరికొత్త ఆవు-పులి కథలు’గా నామకరణం చేశారు. చిన్నచిన్న కథలతో గట్టి సందేశాలిచ్చారు. అందమైన బొమ్మలు, చక్కని ప్రింటింగ్ పుస్తకాన్ని వదలనీయకుండా చేస్తాయి. పులిని మట్టుబెట్టిన ‘ఉపాయం’ కథ ఐకమత్యంగా ఉంటే కలిగే ప్రయోజనాన్ని వివరిస్తుంది. క్రూర మృగమైన పులిని మార్చిన ఆవు కథ ‘ఆత్మార్పణ’ తెలియజేస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందిన కథలు పదేపదే చదవాలనిపిస్తాయి. ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలకు ఈ కథలు చదివి వినిపిస్తే పెద్దలకు కాలక్షేపం, పిల్లలకు నిజాయతీ అలవడుతాయి. పిల్లలతో చదివిస్తే వారిలో పఠనాసక్తితో పాటు తెలుగు భాషపై మమకారమూ పెరుగుతాయనడంలో సందేహం లేదు. రేపటి తరంతో చదివించాల్సిన పుస్తకమిది.
సరికొత్త ఆవు-పులి కథలు
రచన: గరిపెల్లి అశోక్
పేజీలు: 57; వెల: రూ.156
ప్రతులకు: గరిపెల్లి సరోజన, 404, వీఎల్ఆర్ రెసిడెన్సీ, శ్రీనివాసనగర్, సిద్దిపేట-502103
ఫోన్: 98496 49101
పల్లె పరిమళం
కొన్ని ఊహలు ఊసులకందనంత అందంగా ఉంటాయి. కొన్ని కలలు కళాత్మక చిత్రంగా ఉంటాయి. కానీ, కాలగమనంలో అవి తెరమరుగవుతాయి. నిజానికున్నంత నిలకడ వాటికి ఉండదు. అనుభవానికి ఉన్నంత శక్తి వాటికి ఉండదు. నిజం నుంచి పుట్టుకొచ్చే కథలకు విలువ ఎక్కువ. అది పచ్చి తెలంగాణ పల్లెలో ఎదురైన అనుభవాలైతే మరింత నిఖార్సుగా ఉంటాయి. ‘మా కనపర్తి ముషాయిరా’ కథల్లా ఉంటాయి. ఇవి మస్తిష్కంలో నుంచి పుట్టినవి కావు. బలవంతంగా సందర్భాలను సృష్టించిన బాపతు కావు. రచయిత రమేశ్ చెప్పాల హృదిలో గూడుకట్టుకున్న అనుభవాల జోలి ఈ కథలు. కనపర్తి గ్రామానికి చెందిన రచయిత ఆ పల్లెతో తనకున్న అనుబంధాన్ని, ఆ పల్లెవాసులతో పెనవేసుకున్న సంబంధాన్ని ప్రతి కథలోనూ అందంగా ఆవిష్కరించారు. ‘కందూరు’ కథలో తెలంగాణలో పీర్ల పండుగ జరిగే తీరు, కులమతాలకు అతీతంగా పండుగలో అందరూ పాలుపంచుకునే వైనం మన గతానుభవాన్ని స్ఫురణలోకి తెస్తుంది. పల్లె మనసులు ఎంత స్వచ్ఛమైనవో వివరించే హృద్యమైన కథ ‘ఏతుల పోచయ్య’. సింగరేణిలో ఒడలు విరిచి, గనులు తొలిచే కార్మికుల మంచితనాన్ని వివరించే ‘పంచెగట్టిన పావురాలు’ వివరిస్తుంది. ప్రతి కథా ఓ అందమైన అనుభూతిని మిగుల్చుతుంది అనడంలో సందేహం లేదు. ముఖచిత్రం కూడా ఆకట్టుకొనేలా ఉంది.
మా కనపర్తి ముషాయిరా
రచన: రమేశ్ చెప్పాల
పేజీలు: 126; వెల: రూ.200
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
ఫోన్: 98490 73163