హైదరాబాద్: తీవ్ర కల్లోలం వేళ ఓ తీపి కబురు అందింది. కరోనా సెకండ్ వేవ్తో సతమతం అవుతున్న దేశం.. త్వరలోనే కోలుకోనున్నది. జూన్ నెల చివరినాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం తగ్గనున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగిస్తున్న వేళ ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన సూత్ర మ్యాథమెటికల్ మోడల్ ఈ అంచనా వేసింది. సూత్ర గణాంకాల ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలోనూ జూన్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 90 శాతం పడిపోనున్నట్లు తెలిసింది. దేశంలో కోవిడ్ గమణం ఎలా సాగుతోందన్న దానిపై గతంలోనూ సూత్ర స్పష్టమైన అంచనాలు చేసింది.
దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి సగటు సంఖ్య 15 వేలకు చేరుకుంటుందని కూడా సూత్ర పేర్కొన్నది. అయితే జూన్ చివరి నాటికి ఈ సగటు సంఖ్య నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంఖ్య 15వేలకు చేరడం అంటే ఇది చాలా పాజిటివ్ అంశమే.
ఐఐటీ ఖరగపూర్ పరిశోధకులు సూత్ర విధానంతో చేస్తున్న అంచనాలు.. సింగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అంచనాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. 131 దేశాల్లో కరోనా పరిస్థితిపై సింగపూర్ వర్సిటీ ఎలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేసిందో.. అలాంటి అంచనాలనే సూత్ర కూడా చెప్పుకురావడం యాదృశ్చికం. జూన్ 15 తర్వాత ఇండియాలో కోవిడ్ ప్రళయం 97 శాతం తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా సింగపూర్ వర్సిటీ పరిశోధకులు అంచనా వేయడం గమనార్హం.
సూత్ర గణాంకాల విశ్లేషణ ప్రకారం.. జూన్ మొదటి వారంలో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి లోపు పడిపోనున్నాయి. ఐఐటీ కాన్పూర్ పరిశోధకుడు ఎం అగర్వాల్, ఎం కనిత్కర్(ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్), ఐఐటీ హైదరాబాద్కు చెందిన పరిశోధకుడు ఎం విద్యాసాగర్ .. సూత్ర మోడల్ ద్వారా మహమ్మారి కరోనా అంచనా వేశారు. సూత్ర పరిశోధకులు అంచనా వేసిన డేటాను www.covid19india.org లో నిక్షిప్తం చేశారు. సూత్ర పరిశోధకులు చేసిన విశ్లేషణ భిన్నమైంది. మూడు విభిన్న పద్ధతులను అనుసరించి.. చివరకు రోజువారీ కొత్త కేసుల ఆధారంగా.. మహమ్మారి భవిష్యత్తును అంచనా వేస్తున్నారు.