పైవేటీకరణతో ప్రమాదంలో రిజర్వేషన్లు
రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కార్పొరేషన్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ ప్రదాత, దేశం గర్వించదగ్గ వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలకు, మతాలకు అతి పెద్ద పండుగ ఆయన జన్మదినమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3వల్లే రాష్ట్రం సాకారమైందన్నారు. భూమి, గాలి ఉన్నంత వరకు అంబేద్కర్ను ఎవ్వరు మరిచిపోలేరన్నారు. అంబేద్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని, దేశానికి ఆస్తిగా పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. సమన్యాయం కోసం పోరాటం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, కమిషనర్ క్రాంతి, అధికారులు నితానియల్, ఆనంద్కుమార్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.