నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంలో ముగిసింది. సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండగా కొవిడ్ కారణంగా మరో 24గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. దీంతో ఓటింగ్కు మరో రెండు రోజుల గడువు ఉన్నట్లయ్యింది. ఈ నెల 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
-నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్27(నమస్తే తెలంగాణ)
మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నకిరేకల్ పట్టణం తాజాగా 20 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 93 మంది అభ్యర్థులు లబరిలో ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ నుంచి 20 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 14 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు, మరో 14వార్డుల్లో టీఆర్ఎస్ రెబల్, సీపీఎం నాలుగు, ఒక స్థానంలో టీడీపీ, మరో 25 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నకిరేకల్ మేజర్ పంచాయతీగా ఉండగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాన్ని గెలుపొందగా మెజార్టీ వార్డులను, ఉపసర్పంచ్ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో పాటు ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో నకిరేకల్పై ప్రత్యేక దృష్టి సారించి ఇటీవలే రూ. 10కోట్ల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. మరో రూ. 12కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ప్రధాన రహదారి విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. బస్టాండ్ను ఆధునీకరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఇచ్చే పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే చెత్త సేకరించే 10 ఆటోలను కొనుగోలు చేసి పారిశుధ్యంపై దృష్టి పెట్టారు. మున్సిపాలిటీ కావడంతో అదనపు సిబ్బందిని కూడా నియమించే యోచనలో ఉన్నారు. విద్యా, వైద్య సేవల మెరుగుదల కోసం కూడా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు పట్టణంలో కీలకమైన అంతర్గత సమస్యలపై దృష్టి సారించారు. అందుకే నకిరేకల్ ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి వైపు నిలిచేందుకు సిద్ధమయ్యారు.
టీఆర్ఎస్కు పెరిగిన బలం
ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. దీంతో పటిష్టమైన క్యాడర్తో టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగింది. ఇక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇదే సమయంలో గత ఎన్నికల్లో ఇక్కడ గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలహీనంగా మారింది. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ క్యాడర్కు అండదండగా నిలిచేవారు. కానీ ప్రస్తుతం వెంకట్రెడ్డి మాత్రమే చివరి రెండు రోజులు ప్రచారానికి వచ్చారు. అంతకుముందు అభ్యర్థుల ఎంపికలో గానీ, క్యాడర్కు భరసా ఇవ్వడంలో గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం ఆవరించి ఎక్కువ మంది టీఆర్ఎస్ వైపునకు వచ్చేసారు. ఎన్నికలకు ముందుగానే కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో కొండా జానయ్య, రాచకొండ శ్రవణ్కుమార్ వంటి సీనియర్ నేతల నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణలు టీఆర్ఎస్లోకి రాగా మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలోనూ టీఆర్ఎస్ అందరికంటే ముందుంది. వార్డువార్డుల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది.
మంత్రి జగదీశ్రెడ్డి ప్రచారం
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సహకారంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి జగదీశ్రెడ్డి ప్రచారానికి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అభివృద్ధి కోసం టీఆర్ఎస్కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శవంతమైన పథకాలు ప్రజలకు అందుతున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు సాధించుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డుల వారీగా సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ మిగిలిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఆయా వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి అన్ని వార్డుల్లోనూ మంచి స్పందన లభిస్తున్నది.
చివరి రోజు భారీ ర్యాలీ
ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ అభ్యర్థులు తమ వార్డు ప్రజలతో కలిసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా ర్యాలీగా నకిరేకల్ ప్రధాన కూడలికి చేరుకున్నారు. వారం రోజుల ప్రచారానికి ముగింపుగా సాగిన ర్యాలీ పట్టణ ప్రజలను ఆలోచనలో పడేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరుగులేని విజయం ఖాయమన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ అండదండలతోనే నకిరేకల్ అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నట్లు చివరి రోజు ప్రచారం సాగిన తీరు స్పష్టం చేస్తున్నది. ఈ ర్యాలీలో మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నకిరేకల్ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే నకిరేకల్కు నిధుల సాధన సాధ్యమని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో వేగంగా అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్లతో పాటు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. చివరిరోజు ర్యాలీలో మండలి వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొని మాట్లాడారు.