కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెరువుల పునరుద్ధరణ
మొదటి, రెండు విడుతల ద్వారా 37వేల ఎకరాల ఆయకట్టు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన కుమ్రం భీం ప్రాజెక్టు నీటితో నిండుకుండను తలపిస్తున్నది. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీరు వదలడంతో ఇరువైపులా ఉన్న పొలాలకు నీటిని రైతులు మోటర్ల ద్వారా పొలాలకు తరలించుకుంటున్నారు. ఈ యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువ కింద దాదాపు 1000 ఎకరాలకు రైతులు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ప్రధాన కాలువలతోపాటు, దాని ఉప కాలువల నిర్మాణాలు పూర్తయితే 45 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
జిల్లాలో నాలుగు విడుతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగింది. మొదటి, రెండు విడుతల్లో చెరువులు పూర్తిస్థాయిలో మరమ్మతు కాగా.. వర్షాకాలంలో 37 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోనికి వచ్చింది. యాసంగిలో ఈ చెరువుల కింద గతంలో 18 వేల ఎకరాలు సాగయ్యేది. మొదటి విడుతలో రూ.56 కోట్లతో 184 చెరువులు, రెండో విడుతలో రూ.36 కోట్లతో 119 చెరువులను పునరుద్ధరించారు. మొదటి, రెండు విడుతల ద్వారా జిల్లాలో సుమారు 37 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోనికి వచ్చింది. మూడో విడుత కింద 63 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.18 కోట్లు మంజూరు కాగా, నాలుగో విడుతలో 61 చెరువులకు రూ.16 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే సుమారు మరో నాలుగు వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. దీనితోపాటు కొత్త చెరువుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.43.78 కోట్లు మంజూరు చేసింది. ఈ చెరువుల నిర్మాణానికి అధికారులు ప్రస్తుతం భూసేకరణ చేపడుతున్నారు.