అటవీ సంపదను పెంచేందుకు ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు హరిత యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 74 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.89 లక్షల మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నింటినీ బతికించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి నిత్యం నీరు అందిస్తున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. పదిరోజులుగా మురుగు కాల్వలు, నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, కలుపు మొక్కలు, చెత్త తొలగించడం, పాడుబడిన బావుల పూడ్చివేత, శిథిలావస్థలో ఉన్న భవనాల కూల్చివేత, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి పనులు చేపట్టారు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీల రూపురేఖలు మారాయి.
రంగారెడ్డి, జూలై 10, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరందుకున్నది. ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారులు, ప్రజలు ఇలా అందరూ హరిత యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతుండడంతో తెలంగాణకు హరితహారం సామాజిక ఉద్యమంలా సాగుతుంది. ఈ ఏడాది నాటిన ప్రతీ మొక్క సంరక్షణ చర్యలు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రతి ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ఆవరణలో జామ, కరివేపాకు, దానిమ్మ, గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామాల పరిధిలో వివిధ మొక్కలను నాటుతున్నారు. ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు నిమ్మ, సీతాపల్, బొప్పాయ, మునగ, కానుగ, నెమలినార మొక్కలను పెంచుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది తెలంగాణకు హరితహారంలో భాగంగా 74 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.., 2.89 లక్షల మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది.
లక్ష్యం దిశగా..
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 1500 మొక్కలు, ఆమన్గల్లో 660, చేవెళ్లలో 23888, చౌదరిగూడలో 16,699, ఫారూఖ్నగర్లో 24,200, ఇబ్రహీంపట్నం 5570, కడ్తాల్లో 27,910, కందుకూరు 19,400, కేశంపేట 17,224, కొందుర్గు 28,770, కొత్తూరులో 8240 , మాడ్గులలో 24,045, మహేశ్వరంలో 13,106, మంచాలలో 5920, మొయినాబాద్లో 17,306, నందిగామలో 8440, షాబాద్లో 10,550, శంషాబాద్లో 3592, శంకర్పల్లిలో 23,565, తలకొండపల్లిలో 3570, యాచారం మండలంలో 5565 మొక్కలు నాటారు. వీటికి జియోట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు.
ముగిసిన పట్టణ, పల్లెప్రగతి
ప్రతి పల్లె, పట్టణాలను ప్రగతిపథంలోకి తీసుకువచ్చేందుకుగాను చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. పది రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చారు. పట్టణాల్లోనూ పచ్చదనం-పరిశుభ్రతతోపాటు మిగతా అన్నింటిలోనూ ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 16 మున్సిపాలిటీల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది. మున్సిపాలిటీల్లో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఒక్కొక్కటిగా పరిష్కరించారు. వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న దృష్ట్యా ప్రధానంగా పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మున్సిపాలిటీల్లోని మురుగు కాల్వల శుభ్రం, ముళ్ల పొదలను తొలగించడం, పాడుపడిన బావులు పూడ్చి, పాత భవనాలను కూల్చివేయడం, విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. డంపింగ్ యార్డు, శ్మశానవాటికల నిర్మాణాలు, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు. జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రగతి ఇలా..
రోడ్డు పక్కన ఉన్న 1667 కిలోమీటర్ల మేర ముళ్లపొదలను, శిధిలావస్థలో ఉన్న 123 ఇళ్లను, 501 లోతట్టు ప్రాంతాలను పూడ్చివేత, 1314 ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్ప్రే, ఫాగింగ్ చేయడం, 268 ఓహెచ్ఎస్ఆర్లను శుభ్రం చేయడం, 16 మున్సిపాలిటీల్లోని 285 పార్కులను శుభ్రం చేయడం, 728 మతపరమైన ప్రదేశాలతోపాటు విద్యాసంస్థలను శుభ్రం చేయడం, 381 ప్రజా మరుగుదొడ్లను, 153 వైకుంఠదామాలను శుభ్రం చేశారు. పనిచేయని, తెరిచి ఉన్న 21 బోర్లను మూసివేయడం వంటి పనులు చేపట్టారు. అదేవిధంగా పట్టణాల్లో హరితహారంలో భాగంగా 89,412 మొక్కలను నాటారు. నాటిన మొక్కల్లో రోడ్డు మధ్యలో 3549 మీటర్లమేర, 636 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.