‘బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం సులభం కాదు. మన హద్దులు, బలాలు, బలహీనతలేమిటో తెలుసుకోవడంతో పాటు నటనకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలం’ అని చెప్పింది దివి వద్య. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్యాబ్స్టోరీస్’. కె.వి.ఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28న స్పార్క్ ఓటీటీ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా దివి వద్య మాట్లాడుతూ ‘ఈ సినిమాలో శాలిని అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నేను కనిపిస్తా. నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రను పోషించా. ఓ అబ్బాయితో ఏర్పడిన పరిచయం ఆమె జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? క్యాబ్లో జరిగిన సంఘటన కారణంగా నలుగురు వ్యక్తుల జీవితాలు ఏ విధమైన మలుపులు తిరిగాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నేను కథానాయికగా నటించిన తొలి సినిమా ఇది. ‘బిగ్బాస్-4’షో అంచనాలకు మించి నాకు పేరుతెచ్చిపెట్టింది.
నన్ను అందరికీ పరిచయం చేసింది. షోలో పాల్గొనడానికి ముందు సినిమా అవకాశాల కోసం ఎదురుచూశా. బిగ్బాస్ తర్వాత ఆఫర్స్ నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. సినీ పరిశ్రమలో అనేక తిరస్కరణల్ని ఎదుర్కొన్నా. వాటిని చాలెంజింగ్గా తీసుకొని పట్టుదలగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. కథానాయికగానే కాకుండా అగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తా. పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో పాటు నా భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఆ సినిమా ఉండాలి. భారీ సినిమాల్లో చెల్లెలి పాత్రలు మాత్రం చేయను. భార్య, ప్రియురాలి లాంటి క్యారెక్టర్స్ చేస్తా. కథానాయికగా ‘లంబసింగి’ అనే సినిమా చేశా. చిత్రీకరణ పూర్తయింది. ఆర్కా మీడియా నిర్మించిన ‘ఘర్షణ’ అనే వెబ్సిరీస్లో నటించా’ అని తెలిపింది.