టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా అసలు ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అన్నదానిపై ఇప్పటికీ సందేహాలు నెలకొన్నాయి. గతేడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. అయితే ఇప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో జపాన్లో ఎమర్జెన్సీ విధించారు. దీనికితోడు ఈ గేమ్స్ను వాయిదా వేయాలని లేదంటే రద్దు చేయాలని జపాన్లోని మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఒక టీమ్ జపాన్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన సాఫ్ట్ బాల్ టీమ్ మంగళవారం ఉదయం టోక్యోలో ల్యాండయింది. వాళ్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ వెంటనే ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్కు కరోనా టెస్టులు నిర్వహించారు.
వీళ్లందరూ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నా.. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు, జపాన్లో దిగిన తర్వాత కూడా టెస్టులు నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఒలింపిక్స్ నిర్వాహకులకు ఇది ఒకరకంగా కాస్త ఊరట కలిగించే విషయమే. ఒలింపిక్స్ ప్రారంభమయ్యే వరకూ ఈ ఆస్ట్రేలియా సాఫ్ట్ బాల్ టీమ్ టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలోని ఒటా సిటీలోని హోటల్లో ఉండనున్నారు. జులై 23న ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుండగా.. అంతకు రెండు రోజుల ముందు ఈ ఆస్ట్రేలియా సాఫ్ట్ బాల్ టీమ్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. జులై 17న ఈ టీమ్ ఒలింపిక్స్ విలేజ్కు చేరుకుంటుంది.