బాలీవుడ్ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన నాయికగా రాణిస్తోంది భూమి పడ్నేకర్. టాయిలెట్ ఏక్ ప్రేమ్కథ, శుభ్మంగళ్ సావ్ధాన్ వంటి చిత్రాలు ఆమె అభినయసామర్థ్యానికి చిరునామాగా నిలిచాయి. కథాంశాల ఎంపికలో ప్రయోగాలకు, కొత్తదనానికి ప్రాధాన్యతనివ్వడమే తన విజయరహస్యమని చెప్పింది భూమి పడ్నేకర్. ఆమె మాట్లాడుతూ ‘తమ సృజనాత్మక ప్రతిభ ద్వారా సినిమా భవితను మార్చాలనుకునే దర్శకులు నాకు స్ఫూర్తినిస్తారు. అలాంటి వారు చెప్పే కథల్ని వింటా. రొటీన్ కథలు నాకు బోర్గా అనిపిస్తాయి. నటిగా నా పరిధుల్ని విస్తరించుకుంటూ అనునిత్యం కొత్తదారుల్లో పయనించాలని తపిస్తాను. థియేటర్ నుంచి బయటకురాగానే మర్చిపోయే పాత్రలు చేయడం వృథాగా భావిస్తా. ప్రేక్షకుల్ని కొన్నేళ్లపాటు వెంటాడే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘రక్షాబంధన్’ అనే చిత్రంలో నటిస్తోంది.