సినిమాల్లో ప్రజా జీవనాన్ని మెరుగుపరిచే అంశాల్ని చర్చించాలని సలహా ఇచ్చింది బాలీవుడ్ కథానాయిక భూమిపడ్నేకర్. కెరీర్ ఆరంభం నుంచి అర్థవంతమైన కథాంశాల్లో నటిస్తున్న ఈ భామ పర్యావరణ ప్రేమికురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమా తీరుతెన్నులపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేవలం వినోదంపై మాత్రమే దృష్టిపెట్టకుండా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చే కథల్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘సినీ మాధ్యమం ద్వారా చాలా విషయాలు చెప్పొచ్చు. నేడు మారుమూల ప్రాంతాల వారికి కూడా సినిమా చేరువవుతున్నది. ప్రజల జీవిత విధానంలో మార్పు తీసుకువచ్చే కథల్ని ఎంచుకోవాలి. వాణిజ్య పంథాలోనే సందేశాన్ని అందిస్తే త్వరగా ప్రేక్షకులకు చేరుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం భూమిపడ్నేకర్ మిస్టర్.లీలి, రక్షాబంధన్, బదాయ్ దో అనే చిత్రాల్లో నటిస్తోంది.