ప్రైవేటు టీచర్ల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్
25 కిలోల బియ్యం, రూ.2 వేలతో కొండంత అండ
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
సీఎం త్వరగా కోలుకోవాలని శివాలయంలో మంత్రి పూజలు
మహబూబ్నగర్, ఏప్రిల్ 21 : ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ హాలులో ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించిన 25 కిలోల బియ్యం, రూ.2 వేలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేటు పాఠశాలలు కొనసాగక టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిందన్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. పాలమూరులో సేవల కోసం వైద్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.
శివాలయంలో పూజలు
తెలంగాణ సాధకులు, సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంక్షించారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటి వద్దకే వచ్చి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు మూడు మోబైల్ అంబులెన్స్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. జెడ్పీ సమావేశ మందిరం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మెడికల్ కాలేజీ డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.