కరోనా వచ్చి మన జీవన విధానాలను పూర్తిగా మార్చివేసింది. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల జాగ్రత్తను పెంచింది. కరోనా వస్తే ఆసుపత్రి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిన అనుభవాలు మిగతావారికి కనువిప్పును కలిగించాయి. ఒకప్పుడు కోటికొక్కరు తీసుకున్న కోటి రూపాయల ఆరోగ్య బీమాను తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోయిందని పాలసీ బజార్ అధ్యయనంలో వెల్లడైంది. 2019లో మొత్తం అమ్ముడైన ఆరోగ్య బీమా పాలసీల్లో కోటి రూపాయల బీమాలు కేవలం రెండు శాతమే. ప్రస్తుతం ఏకంగా 35 శాతానికి పెరిగాయని పాలసీ బజార్ డాటా చెబుతోంది. ఇలా అత్యధిక విలువైన పాలసీలకు ఆదరణ పెరగడానికి కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఆసుపత్రి ఖర్చులేనట. ఇంకా చెప్పాలంటే.. గత మూడు నెలల్లో కోటి రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవారు నిరుడుతో పోలిస్తే 9 నుంచి 12 శాతానికి పెరిగారట. దీనికి ప్రధానం కోవిడ్ వస్తే హాస్పిటల్ ఖర్చులు భారీగా ఉంటుండటమేనని తీసుకున్న వారంతా చెబుతున్న మాట. మ్యాక్స్ బూపా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్ అత్యధికంగా ఈ కోటి రూపాయల పాలసీలను విక్రయించాయి. కాగా, మొత్తం పాలసీల్లో 5 లక్షల పాలసీలు 35 శాతం ఉంటే, 10 లక్షల పాలసీలు 11 శాతం., కోటి రూపాయల పాలసీల వాటా 15 శాతంగా ఉన్నాయి.
ఇంత పెద్ద మొత్తానికి పాలసీ తీసుకుంటే ప్రీమియం మరీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందా? ఇది అందరికి వచ్చే సందేహమే. నిజం చెప్పాలంటే మరీ ఎక్కువేం కాదు. వార్షిక ప్రీమియం మరో రెండు, మూడు వేలు పెరుగుతుందంతే. ఉదాహరణకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఎన్సీబీ సూపర్ ప్రీమియం పాలసీ వార్షిక ప్రీమియం కేవలం రూ.1,020. అదే పది లక్షల కవరేజికి రూ. 758 (ఈ ప్రీమియం వయస్సు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వంటి కొన్ని షరతులకు లోబడి ఉంటుంది) ఇది పెద్ద తేడానే కాదు. కానీ, ఈ కోటి రూపాయల ఆరోగ్య బీమాకు కొంత మంది మాత్రమే అర్హులు.