వీసీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్
విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 9: పాఠశాలలు తెరిచే వరకు ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి మంత్రి గంగుల కమలాకర్, సీఎస్ రాజీవ్శర్మ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ అర్వింద్కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ చిత్ర రామచంద్రన్తో కలిసి ఆమె జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అందించే రూ.రెండు వేల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం విధి విధానాలపై సమీక్షించారు. కలెక్టర్లు అర్హులైన వారందరినీ క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రభుత్వ సహాయం అందేవిధంగా చూడాలన్నారు. సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని పౌర సరఫరాల సిబ్బందిని ఆదేశించారు. సీఎస్ రాజేశ్ శర్మ మాట్లాడుతూ.. ఆయా జిల్లాల కలెక్టర్లు అర్హులందరి బ్యాంకు, ఆధార్ వివరాలను ఈనెల 18వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ అర్వింద్కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లో అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు శరత్, నారాయణరెడ్డి, కామారెడ్డి ఆర్డీవో శ్రీను, నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, సివిల్ సైప్లెస్ అధికారులు వెంకటేశ్వరావు, అభిషేక్సింగ్ పాల్గొన్నారు.