ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ కథానాయకుకుడిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. వర్ష బొల్లమ్మ కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ ‘సౌమ్యమైన మనస్తత్వం కలిగిన యువకుడి కథ ఇది. ప్రేమ, పెళ్లి, జీవితం పట్ల అతని ఆలోచనలు, కుటుంబ అనుబంధాల పట్ల అనురాగాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సూర్య, ఎడిటర్: నవీన్నూలి, ఆర్ట్: అవినాష్ కొల్ల, సంగీతం: మహతిస్వరసాగర్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, రచన-దర్శకత్వం: లక్ష్మణ్ కె కృష్ణ.