రానా ప్రయోక్తగా ‘ఆహా’ ఓటీటీ వేదికలో ‘నెం.1 యారి సీజన్-3’ టాక్షో ప్రారంభమైంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రానా మాట్లాడుతూ ‘నేను చాలా షోస్కు గెస్ట్గా వెళ్లాను. యారీ గేమ్షోకు హోస్ట్గా పనిచేశాను. నా అనుభవంలో గెస్ట్గా ఉండటం కంటే హోస్ట్గా ఉండటమే సులభమని తెలుసుకున్నా. ‘నెం.1 యారి సీజన్-3’ గత రెండు సీజన్స్కు చాలా భిన్నంగా ఉంటుంది. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ కార్డ్స్ గేమ్స్ తరహాలో ఇందులో ట్రంప్ కార్డ్ గేమ్షోను సినీతారలతో ఆడబోతున్నాం. పాత పాటలను కొత్త హిప్హాప్ సాంగ్స్తో మిక్స్ చేసి ఇండిపెండెంట్ పాటల మాదిరిగా చూపించబోతున్నాం’ అన్నారు. ‘నెం.1 యారి’ సెలబ్రిటీ టాక్షోలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అతిథులుగా రాబోతున్నారు. అగ్ర నటుడు చిరంజీవితోపాటు రామ్చరణ్, విజయ్ దేవరకొండ, తమన్నా తదితరులు అతిథులుగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ‘ఆహా’ ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది.