కమెడీయన్, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా అలరించబోతున్నాడు. బండ్లని హీరోగా పరిచయం చేస్తూ.. కొత్త దర్శకుడు వెంకట్ చంద్ర ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే సంగతి తెలిసిందే. స్వాతి చంద్ర నిర్మాత. సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
బండ్ల గణేష్ నటన కన్నా కూడా ఆయన ఇచ్చే స్పీచ్, ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తాజాగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాను రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం క్షీణించిందని, ఒక్కరోజు ఆలస్యమైనా కూడా తన ప్రాణాలు పోయేవని.. అలాంటి కఠిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేష్ అన్నారు.
ఆ రోజు చిరంజీవి లేకపోయి ఉంటే నేను అసలు ప్రాణాలతో ఉండే వాడిని కాదు. నాకు కరోనా వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఇంట్లో వాళ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. అనగానే మరింత వణికిపోయాను. ఆ సమయంలో పెద్ద పెద్ద వాళ్లను కలిసిన కూడా కనీసం హాస్పిటల్ లో ఒక బెడ్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్కి చేయాలని అనుకున్నా, ఆయన అప్పుడు కరోనాతో బాధపడుతున్నారు.
ఏ ఆప్షన్ లేక చిరంజీవికి కాల్ చేశాను. ఆయన బెడ్ ఏర్పాటు చేసి పా ప్రాణం కాపాడారు. ఆ సమయంలో నా లంగ్స్ 80 శాతం డ్యామేజ్ అయ్యాయి. ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నానంటే దానికి కారణం చిరంజీవి అని బండ్ల గణేష్ ఎమోషనల్గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాకు ఒక జీవితాన్ని ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని ఆయన చెప్పడం విశేషం.