నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 61వ బర్త్డేని నిరాడంబరంగా జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వలన అభిమానులని కూడా తన దగ్గరకు రావొద్దని సూచించారు. అయితే తనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. బాలయ్య ఎప్పుడు తన అభిమానులకు అండగా నిలబడడమే గాక ప్రోత్సహిస్తూ ఉంటారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం అందించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన మురుగేష్ (23) కొద్ది రోజుల క్రితం చెట్టు మీద నుంచి కిందపడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నబాలయ్య అతనికి నేరుగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో నా నడుముకు తీవ్ర గాయమైంది. ధైర్యంగా ఉండటంతో తిరిగి కోలుకున్నానని మురుగేష్కు కాస్త ధైర్యం అందించారు బాలయ్య. అంతేకాదు బాధితుడికి 40 వేల రూపాయల ఆర్ధిక సాయం కూడా చేశారు.