నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న సత్యపాల్రెడ్డి (33) ప్రమాదవశాత్తు మచ్చర్ల గ్రామ శివారులోని బావిలోపడి మృత్యువాత పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండల కేంద్రానికి చెందిన సత్యపాల్రెడ్డి డిచ్పల్లి ఏడో బెటాలియన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఓ విందులో పాల్గొనేందుకు మంగళవారం బయలుదేరి వెళ్లాడు. విందు ముగిసిన అనంతరం రాత్రి తిరుగు పయనం అయ్యాడు. మచ్చర్ల గ్రామ శివారుకు చేరుకున్న సత్యపాల్రెడ్డి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టడంతో ఎగిరి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. బావిలో చెత్త, పిచ్చి చెట్లు ఉండడంతో సత్యపాల్రెడ్డి అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు.
బుధవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ రఘు, ఎస్హెచ్వో సైదేశ్వర్, ఎస్సై యాదగిరిగౌడ్ పరిశీలించారు. అనంతరం మచ్చర్ల గ్రామస్తులను అడిగి వివరాలు సేకరించారు. సత్యపాల్రెడ్డికి భార్య సంధ్యారెడ్డి, కుమారుడు లిఖిత్రెడ్డి, కూతురు నిశోధరెడ్డి ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.