సిటీబ్యూరో, జూన్ 19(నమస్తే తెలంగాణ): ముక్కూ మొహం తెలియదు. కానీ ఆన్లైన్లో అతడిని మెచ్చింది. ఆ మోసగాడు విసిరిన వలలో పడి అరకోటి సమర్పించుకున్నది. నైజీరియన్ సైబర్ దొంగ చేతిలో నష్టపోయిన నగరానికి చెందిన ఓ మహిళ ఉదంతమిది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మహిళకు వివాహమైన కొన్నాళ్లకు భర్త చనిపోయాడు. తదనంతరం ఆయన పేరుతో ఉన్న కొంత డబ్బు కూడా ఈమెకు దక్కింది. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకునేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టింది. భారత్ మ్యాట్రీమోని వెబ్ సైట్లో తన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఆమె ప్రొఫైల్ చూసి ఇటలీలో డాక్టర్గా పనిచేస్తున్నానంటూ విజయానంద్ పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రొఫైల్స్ చూసుకొని పెండ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
తాను పుట్టింది ఇటలీలో అయినా.. తన తల్లిదండ్రుల స్వస్థలం ఇండియానేనని వివాహమైన తర్వాత భారత్లోనే ఉండిపోతానని ఆమెను నమ్మించాడు. తిరిగి వచ్చేందుకు ఇటలీలో తన పేరుతో ఉన్న దవాఖానను అమ్మేస్తున్నానని ఆ డబ్బులతో భారత్లో కొత్త దవాఖాన ప్రారంభిద్దామని చెప్పాడు. ఇదంతా నిజమేనని ఆమె విశ్వసించింది. ఇంతలో.. తాను దవాఖానలోని కొంత సామాగ్రిని విక్రయించడంతో 20 వేల యూరోలు వచ్చాయని, వాటితో పాటు కొంత డబ్బు, బంగారం, వజ్రాలను పంపిస్తున్నానంటూ వాట్సాప్లో ఫొటోలు పెట్టాడు. వీటికోసం ఎదురుచూస్తున్న ఆ మహిళకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులమని చెబుతూ ఓ ఫోన్ వచ్చింది. యూరోల పార్సిల్ వచ్చిందని కొంత రుసుము కడితే వాటిని విడుదల చేస్తామంటూ ఆమెకు చెప్పారు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆమె వారు అడిగిన డబ్బులన్నీ వేస్తూ వెళ్లింది. ఇలా పదిరోజుల పాటు మొత్తం రూ. 50 లక్షలు డిపాజిట్ చేసింది. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో మోసమని గుర్తించి శనివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పుణేకు చెందిన ప్రముఖ గాయకుడితో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించి నగరానికి చెందిన ఓ సంస్థ సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి 9.4 లక్షలు పొగొట్టుకున్నది. ఓ ప్రముఖ గాయకుడిని సంప్రదించేందుకు ఆన్లైన్లో ఆ సంస్థ వెతికి కొన్ని ఫోన్నంబర్లను దొరికించుకున్నది. ఆ నంబర్లు ఫోన్ చేయడంతో వాళ్లు ఆ గాయకుడి ప్రతినిధులమంటూ సంభాషణ జరిపారు. కార్యక్రమ నిర్వహణకు అంగీకరించి 15 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అడ్వాన్స్గా 9.4 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత చెప్పిన తేదీకి రాకుండా చేతులెత్తేశారు. ఈ సారి 10 లక్షల మంది ప్రేక్షకులు వస్తేనే గాయకుడు వస్తాడని షరతు విధించారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన ఆ సంస్థ శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.