సమస్యలుంటే మాకు చెప్పండి
కొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందూరు, మే 25: ‘ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా..? మీకు మందులు ఇస్తున్నారా.. మీ ఆరోగ్య విషయాలపై పర్యవేక్షణ చేస్తున్నారా..’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి కొవిడ్ బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి జ్వరసర్వేలో వైద్య బృందం గుర్తించిన 12 మంది కొవిడ్ బాధితులకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు విడుతల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు మీ ఇండ్లకు వస్తున్నారా..ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారా.. మందుల కిట్ అందజేశారా తదితర విషయాలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తున్నారా అని తెలుసుకున్నారు. కొవిడ్ బాధితులకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏవో సుదర్శన్, డీఎంహెచ్వో బాలనరేంద్ర పాల్గొన్నారు.