సికింద్రాబాద్, జూన్ 12: సికింద్రాబాద్ నియోజకవర్గంలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని ఉప్పరిబస్తీలో రూ. 11లక్షలతో డ్రైనేజీ, బీదలబస్తీలో రూ. 18 లక్షలతో డ్రైనేజీ, ఎరుకలబస్తీలో రూ. 4.85 లక్షల ఖర్చుతో తాగునీటి పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని, సివరేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని అన్నారు. ఇటీవల రూ. 10 కోట్లమేరకు నిధులను సివరేజీ లైన్ల మార్పిడికి వినియోగించినట్లు తెలిపారు. నాలాల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో సాధారణ సమస్యలు మాత్రమే వస్తాయన్నారు.