ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆల్రౌండర్ మొయిన్ అలీ 31 బంతుల్లో 46 పరుగులు చేసి చెన్నై విజయాన్ని సునాయాసం చేశాడు. చేజింగ్లో 24 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్ (5) రూపంలో సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయినా రెండో వికెట్కు డుప్లెస్సితో కలిసి 66 పరుగులు జోడించాడు మొయిన్ అలీ. ఈ ఇద్దరూ పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. చెన్నైని లక్ష్యం వైపు నడిపించారు. అసలు ఏ సమయంలోనూ చెన్నై ఇబ్బంది పడలేదు. గెలుపు ముంగిట రైనా (8), రాయుడు (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. అయితే మిగిలిన పనిని డుప్లెస్సి (36 నాటౌట్), శామ్ కరన్ (5 నాటౌట్) ముగించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి టీమ్ విజయాన్ని గిఫ్ట్గా ఇచ్చింది.
ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 106 పరుగులు చేసింది. అది కూడా యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో పంజాబ్ కింగ్స్ కాస్తయినా పరువు నిలుపుకుంది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్ను షారుక్ ఆదుకున్నాడు. ఐపీఎల్ అనుభవం పెద్దగా లేకపోయినా ఎంతో పరిణతితో అతడు ఆడాడు. కెప్టెన్ రాహుల్ (5) సహా మయాంక్ అగర్వాల్ (0), గేల్ (10), పూరన్ (0)లాంటి స్టార్లు వెంట వెంటనే వెనుదిరిగినా.. షారుక్ మాత్రం 36 బంతుల్లో 47 పరుగులు చేసి పంజాబ్ స్కోరును 100 దాటించాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. అతనికి దీపక్ హుడా (10), జై రిచర్డ్సన్ (15) కాస్త సహకరించారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ చెలరేగి బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. అతని ధాటికి టాప్, మిడిలార్డర్ కుప్పకూలాయి. ఇక ఫీల్డింగ్లో జడేజా అద్భుతంగా రాణించాడు. రాహుల్ రనౌట్, గేల్ క్యాచ్ను పట్టిన తీరు మ్యాచ్కే హైలైట్. ఒక రకంగా రాహుల్ను అతడు రనౌట్ చేయడంతోనే మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. రాహుల్ వికెట్ తర్వాత ఇక పంజాబ్ కోలుకోలేకపోయింది.