‘మా ఇద్దరిది గాఢమైన స్నేహం మాత్రమే. అంతకుమించిన బంధమేదీ లేదు’…అనే మాటను కథానాయికల నోట తరచుగా వింటుంటాం. ఫలానా వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నారట కదా? అనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా అందాల నాయికలు అలాంటి సమాధానాలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తారు. తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అన్యాపదేశంగా తెలియజేసే ట్రిక్ అదని అభిమానులు భావిస్తుంటారు. బాలీవుడ్ అగ్రకథానాయిక కియారా అద్వాణీ సైతం అదే ధోరణిలో తన ప్రేమ వ్యవహారంపై స్పందించింది. యువహీరో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ సుందరి ప్రేమలో ఉందని హిందీ చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట కలిసి నటించిన ‘షేర్షా’ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ మల్హోత్రాపై పొగడ్తలు కురిపించింది కియారా. ‘వృత్తిపట్ల అతని నిబద్దత చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ప్రతి సినిమా కోసం ఎంతో కసరత్తు చేస్తాడు. అతనికున్న గొప్ప లక్షణాల్లో పుస్తకపఠనం ఒకటి. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి కాబట్టే మంచి స్నేహితులుగా ప్రయాణం సాగిస్తున్నాం’ అని కియారా చెప్పుకొచ్చింది. ఆమె మాటలతో ఈ జంట మధ్య బంధం మరింత బలపడిందని అభిమానులు అనుకుంటున్నారు.