రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లా
ద్వితీయ స్థానంలో నాగర్కర్నూల్..
స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తున్న ప్రజలు
పల్లెప్రగతితో వచ్చిన మార్పు..
మహబూబ్నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆస్తిపన్ను వసూలులో వనపర్తి జిల్లా టాప్లో నిలిచింది. గ్రామ పంచాయతీల్లో వందకు వందశాతం వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 255 జీపీలు ఉండగా రూ.231.35 లక్షలు వసూలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన మూడు జిల్లాల్లో 90 శాతానికిపైగా పన్ను వసూలైంది. నాగర్కర్నూల్లో 95.46 శాతం, పాలమూరు జిల్లాలో 94.23 శాతం, నారాయణపేట జిల్లాలో 93.79 శాతం, గద్వాల జిల్లాలో 88.05 శాతం పన్ను వసూలు చేశారు. పంచాయతీరాజ్ చట్టం వచ్చాక పన్ను వసూలుపై పాలకవర్గాలు దృష్టి సారించాయి. దీనికితోడు పల్లెప్రగతితో వచ్చిన మార్పుతో కూడా ఆదాయం పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఆస్తిపన్ను వసూళ్లలో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల మినహా మిగ తా అన్ని జిల్లాలు 90 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూ లు చేసి రికార్డు సృష్టించాయి. వనపర్తి జిల్లా నూటికి నూరు శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. వనపర్తి తర్వాత నాగర్కర్నూల్ జిల్లా 95.46 శాతం వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 88.05 శాతం ఆస్తిపన్ను వసూలైంది. గ్రామ పంచాయతీల్లో ఈ స్థాయిలో ఆస్తి పన్నులు వసూలు కావడానికి ప్రజల్లో వచ్చిన మార్పే కారణమని అధికారులు చెబుతున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. ఆస్తి పన్ను వసూలు చేసే అంశంలో పంచాయతీ పాలక వర్గాలు సైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అందువల్లే పెద్ద ఎత్తున ఆస్తిపన్ను వసూలైందని అధికారులు తెలిపారు.
వనపర్తి టాప్..
వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా రూ.231.35 లక్షల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వంద శాతం పూర్తి చేశారు. రాష్ట్రంలోనే వంద శాతం పన్ను వసూలు చేసిన ఏకైక జిల్లాగా వనపర్తి నిలిచింది. వనపర్తి తర్వాత స్థానంలో నాగర్కర్నూల్ 95.46 శాతం ఆస్తిపన్ను వసూలుతో ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం సాధించింది. మహబూబ్నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉండగా రూ.552.27 లక్షల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రూ.520.41 లక్షల పన్నులు వసూలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా 94.23 శాతంతో ఉమ్మడి జిల్లాలో మూడో స్థానంలో నిలిచింది. నారాయణపేట జిల్లా 93.79 శాతంతో నాలుగో స్థానంలో ఉంది.
బాధ్యత పెరిగి..
కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల సమగ్ర స్వరూప మే మారిపోయింది. చక్కని రోడ్లు, పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు, వీధి దీపా లు, ఎప్పటికప్పుడు చెత్త సేకరణ.. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయా యి. పల్లెటూర్లు అంటే చెత్త చెదారంతో ఉంటాయనే అపప్రద పోయింది. ఇదంతా గమనించిన ప్రజలు సైతం బాధ్యత పెరిగి సకాలంలో పన్ను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో పన్ను వసూళ్లు అంచనాలకు మించిపోయింది.
బాధ్యతను గుర్తు చేస్తున్నాం..
ఒకప్పుడు గ్రామాల్లో పన్నుల వ సూళ్లు అంటే ప్రజలు వింతగా చూసేవారు. డబ్బులు వసూలు చేసేందుకు సిబ్బంది తిప్పలు పడాల్సి వచ్చేది. ఇ ప్పుడు జనాల్లో మార్పు వచ్చింది. పంచాయతీ కార్యదర్శులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పన్ను లు పెండింగ్లో ఉంటే భారం పెరుగుతుందనే కారణంతో కూడా చెల్లిస్తున్నారు. వనపర్తి జిల్లా వంద శాతం పన్నులు వసూలు చేసినందుకు సంతోషంగా ఉంది.
కొవిడ్ కారణంగా వెనుకబడ్డాం..
నాగర్కర్నూల్ జిల్లాలో 95.46 మేర ఆస్తి పన్నులు వసూలు చేశాం. కొవిడ్ మూలంగా వందశాతం మేర పన్ను వసూలు చేయలేకపోయాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. స్వచ్ఛందంగా వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు.
ఒకప్పుడు వెంటపడే వాళ్లం..
ఒకప్పుడు పన్ను చెల్లించమని ఇంటింటికీ తిరిగి అడిగినా పట్టించుకునేవారు కాదు. పల్లెప్రగతి ప్రారంభమైన తర్వాత గ్రామంలో అభివృద్ధి ఫలాలను ప్రజలు గమనిస్తున్నారు. సీసీ రోడ్లు ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, నిత్యం తాగునీటిసరఫరా, మౌలిక వసతుల కల్పన.. ఇలా అన్ని రంగాల్లో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. దీంతో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి పన్ను చెల్లిస్తున్నారు. రూ.15.80 లక్షల ఆస్తిపన్ను వసూలు చేశాం.
ఇవి కూడా చదవండి
ఆన్లైన్ ట్రేడింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్టు
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు