భువనేశ్వర్: యాస్ తుఫాన్ తీరం వైపు శరవేగంగా దూసుకొస్తున్నది. దాంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రచండ గాలుల వేగానికి పూరి గుడిసెలు కొట్టుకుపోతుండటంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
యాస్ తుఫాన్వల్ల తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఏపీలో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ కారణంగా ఈ నెల 27 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎండీ కమిషనర్ కన్నబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. కలింగపట్నం సహా ఇతర ఓడరేవులకు అధికారులు తుఫాన్ సమాచారం అందించారు.