మెదక్ : ఎన్నో ఏండ్లుగా ఎండలో ఎండుతూ..వానలో తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, చిరు వ్యాపారుల కష్టాలు నేటితో తీరనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని తూప్రాన్ పురపాలిక పరిధిలోని అల్లాపూర్ టోల్ గేట్ వద్ద కోటి అరవై లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ (వే సైడ్ మార్కెట్ ) ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తూప్రాన్ పట్నంలో రెండో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దుకాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో 50 మంది వరకు కూరగాయలు, పండ్లు, మక్కబుట్టలు, వేరు సెనక్కాయలు, విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్టాల్స్ ఎవరికి కేటాయించడం లేదని ఎవరు ముందు వస్తే వారు స్టాల్లో కూర్చొని విక్రయించు కోవచ్చని తెలిపారు.
కూరగాయలు అమ్మే వారు మాత్రమే గాక రోడ్డు ప్రక్కన విక్రయించే పండ్లు, మొక్కలు, వేరుశెనక్కాయలు తదితర చిరు వ్యాపారులు కూడా ఇక నుంచి ఈ మార్కెట్ లోనే విక్రయించు కోవాలని సూచించారు. స్టాల్స్ తక్కువైతే మరికొన్ని షెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎవరు కూడా రోడ్డు బయట విక్రయించకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు.
తూప్రాన్ పట్టణంలో ఏర్పాటుచేసిన రెండో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నుంచి సబ్సిడీపై ఎరువులు, రసాయన మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఒంటేరు ప్రతాపరెడ్డి ,ఎలక్షన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ,జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్ ,ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ , తహసీల్దార్ శ్రీదేవి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.