న్యూఢిల్లీ, జూన్ 6: కెనడాలో వింత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. నిద్రలేమి, కండరాల బలహీనత, భ్రమ, పీడకలల భయం లాంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కెనడాలోని న్యూబ్రన్స్విక్ ప్రావిన్స్లో ఎక్కువ మంది ఈ వింత వ్యాధి బారిన పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 48 మంది ఈ లక్షణాలతో దవాఖానల్లో చేరారు. ఈ లక్షణాలకు గల కారణం ఏమిటన్నది వైద్యులకు, న్యూరాలజీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆరేండ్ల కింద మొదట ఈ వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో మరణించి ఆరుగురి మెదడులపై పరిశోధనలు నిర్వహించినా వ్యాధికి గల కారణం ఏమిటన్నది తెలియలేదు. సెల్ఫోన్ టవర్ల వల్లే ఇలా జరుగుతుందని కొందరు, కరోనా వ్యాక్సిన్లే కారణమని కొందరు భావిస్తుండగా, వాతావరణంలో మార్పులే ఈ వ్యాధికి కారణమని మరికొందరు వాదిస్తున్నారు.