కోస్గి, మే 18 : రైతులకు ఇబ్బంది లేకుం డా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వరి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను కోరారు. మంగళవారం పట్టణ శివారులోని వరి గోదామును, రైస్ మిల్లును తనిఖీ చేశా రు. వారం రోజులుగా గన్నీ బ్యాగులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయోద్దని కోరారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంలకు, రైస్ మిల్లులకు తరలించాలని గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోనన్నారు.అంతకుముందు మండలంలోని ముస్రిఫా గ్రామంలో నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కోస్గి పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న దవాఖాన పనులను ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి దవాఖానను ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్ సహకరించి వేగంగా పనులు చేయించాలన్నారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శాసం రామకృష్ణ, కౌన్సిలర్లు, శ్రీనివాస్, మల్లేశ్, నాయకులు రాజేశ్, హరి, వెంకటయ్య, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.