న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.8,923 కోట్ల నిధులను ఆదివారం విడుదల చేసింది. పంచాయతీ రాజ్ పరిధిలోని మూడు అంచెలైన గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిలకు ఈ నిధులు జారీ చేసింది. కరోనా నియంత్రణకు అవసరమైన వనరులను సమకూర్చుకునేందుకు ఈ నిధులు వినియోగించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు తొలి విడత నిధులను జూన్లో కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో నియంత్రణ చర్యల కోసం వీటిని ఒక నెల ముందుగా కేంద్రం ఇచ్చింది. అలాగే నిధుల విడుదలకు అడ్డంకిగా ఉండే నిబంధనలను పక్కనపెట్టి గ్రాంట్స్ అందజేసింది.