‘తెలుగు సినిమాతో నా అనుబంధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కె.విశ్వనాథ్, బాలచందర్, మణిరత్నం వంటి దిగ్దర్శకుల నుంచి ఎన్నో గొప్ప విషయాల్ని నేర్చుకున్నాను. వాళ్ల స్ఫూర్తితోనే ఈ కథను రాశాను. ఓ సంగీతకారుడి సంఘర్షణకు దృశ్యరూపంగా ఈ సినిమా సాగుతుంది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. జియో స్టూడియోస్తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘99సాంగ్స్’. విశ్వేష్కృష్ణమూర్తి దర్శకుడు. ఇహాన్భట్, ఎడిల్సీ జంటగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘గత నాలుగేళ్లుగా ఈ సినిమాతో కలిసి చేసిన ప్రయాణంలో సంగీతాన్ని నేను చూసే కోణం మారింది. కేవలం స్వరకర్తగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, నటుడిగా ఇప్పుడు సంగీతాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నా. 2001లో లండన్ వెళ్లినప్పుడు నా స్నేహితుడొకరు ‘నీ దగ్గర కథ ఏమైనా ఉందా?’ అని అడిగాడు. సంగీతం నా పని కదా..కథ నా దగ్గర ఎందుకు ఉంటుందని బదులిచ్చాను. ఆ తర్వాత జీవితానికి, కథలకు, సంగీతానికి చాలా దగ్గరి సంబంధం ఉందని తెలుసుకున్నా. ఒక్క సంగీతమే కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని స్క్రిప్ట్రైటింగ్, ఫిల్మ్మేకింగ్, కెమెరా వర్క్కు సంబంధించిన వర్క్షాప్స్కు హాజరయ్యాను. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ సంగీతకారుడి జీవన సంఘర్షణను ఆవిష్కరిస్తూ ఈ కథ రాశాను. ఈ సినిమా పాటలన్నీ బాగా కుదిరాయి’ అన్నారు. ఆస్కార్ విజేత అయినప్పటికీ రెహమాన్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పురాలేదని, సంగీతమే ప్రపంచంగా జీవిస్తున్నాడని సీనియర్ సంగీత దర్శకుడు కోటి ప్రశంసించారు.